హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని దేశంలో నంబర్వన్గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అన్ని అర్హతలు, వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.466 కోట్లతో 2.81 పొడవుతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శిల్పా ఫ్లై ఓవర్ హైదరాబాద్లో రెండో అతి పొడవైన వంతెన అని తెలిపారు.
ఎస్ఆర్డీపీ సీఎం కేసీఆర్ మాసనపుత్రిక అని, 2014లోనే సీఎం ఆలోచనల్లో నుంచి ఇది పుట్టుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తున్నదని, విశ్వనగరంగా ఎదిగేందుకు దీనికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజా అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎస్ఆర్డీపీ పథకాన్ని జీహెచ్ఎంసీకి సీఎం అప్పగించారని వివరించారు. రూ.8 వేల కోట్లతో ఈ పథకానికి రూపకల్పన చేసి 48 పనులు చేపట్టగా, ఆరేండ్లలోనే 33 చోట్ల పనులు పూర్తిచేశామని, మిగతావి కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ‘పరిశ్రమల శాఖ మంత్రిగా చాలా దేశాలు, మనదేశంలోని పలు నగరాలు తిరిగాను. హైదరాబాద్లో ఉన్న సదుపాయాలు మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్లో కూడా లేవు. హైదరాబాద్లో ఉన్న అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు మరెకడా లేవని ఢంకా బజాయించి చెప్పవచ్చు’ అన్నారు.
నగరం విస్తరిసున్నందున ప్రజా రవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘ఎంఎంటీఎస్ కోసం రూ.200 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, ఈ నిధులతో ఎంఎంటీఎస్ విస్తరణ చేపడుతామని తెలిపారు. మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సహకరించినా, సహకరించకపోయినా మొదటి దశలాగే రెండో దశను కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా మెట్రోను 63 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్ బీనగర్ వరకు 5 కిలోమీటర్లు, మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మిస్తామని వివరించారు. కొవిడ్తో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఎస్ఆర్డీపీ రెండో దశను రూ.3500 కోట్లతో చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఆర్ఎంపీ కార్యక్రమంలో భాగంగా నగరంలో 710 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను బాగు చేసినట్టు వివరించారు. ఎంత వర్షం కురిసినా దెబ్బతినకుండా చర్యలు తీసుకొంటున్నామని, ప్రధాన రోడ్లపై రద్దీ తగ్గించేందుకు లింక్ రోడ్లు అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఈ లింకు రోడ్లపై పౌరుల నుంచి అభినందనలు వస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసిన ఏజెన్సీ, జీహెచ్ఎంసీ అధికారులను కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.