హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశ మందిరంలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. శాసనసభ సంయుక్త సమావేశం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరస్పరం పలకరించుకున్నారు. చలోక్తులు విసురుకున్నారు. ఆలింగనాలు, అలయ్ బలయ్ తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ 11.55 గంటలకు అసెంబ్లీ సమావేశ మందిరంలోకి వచ్చారు.
వస్తూనే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పేరుపేరునా పలకరిస్తూ ముందుకుసాగారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల దగ్గరికీ తానే స్వయంగా వెళ్లారు. కేటీఆర్ వెళ్లగానే మర్యాదపూర్వకంగా లేచి నిలబడి సభ్యులు కరచాలనం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్తో మంత్రి చాలాసేపు ముచ్చటించారు. పరస్పర పలకరింపులు.. షేక్హ్యాండ్స్ ఇస్తూ కదిలారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో ముచ్చటిస్తూనే ఎమ్మెల్యే జగ్గారెడ్డివైపు చూసి అభివాదం చేశారు. జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ వద్దకు వచ్చి పలకరించారు. తరువాత ఎంఐఎం సభ్యుల దగ్గరికి వెళ్లి విష్ చేశారు. మొత్తంగా సభలో ఉన్న ప్రతిఒక్కరిని పేరుపేరునా మంత్రి కేటీఆర్ పలకరించారు.