80 లక్షల కోట్లు అప్పుగా తెచ్చిన మోదీ.. ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలి. ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టయినా నిర్మించారా? మరేదైనా జాతీయస్థాయి నిర్మాణం పూర్తిచేశారా? పోనీ పేదల కడుపునింపే ఒక సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టారా? ఇవేవీ చేయనప్పుడు.. ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొకసాలకు చేరిందో మోదీయే జవాబు చెప్పాలి.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే లక్ష్యంతో దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి కేంద్ర బీజేపీ సర్కారు తెగించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్నులేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలను అమలుచేస్తున్న కేంద్ర బీజేపీ సరారు.. సంక్షేమ పథకాలపై అక్కసు వెళ్లగక్కడంలో ఆశ్చర్యమేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎకువమంది పేదలున్న దేశంగా భారత్ అపకీర్తిని గడించిందని తెలిపారు. ఉచిత పథకాలు ఉండకూడదనే విధంగా ఇటీవల ప్రధాని మోదీ అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీస్ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతుండటాన్ని నిరసిస్తూ శనివారం మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఉచిత పథకాలపై చర్చ పేరిట పేదవాడి పొట్టగొట్టడానికి కొత్త పాచిక వేసిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సూచీలో భారత్ స్థానం దిగజారి 116 దేశాల జాబితాలో 101వ స్థానానికి చేరుకున్నదని, పుట్టిన పిల్లల్లో 35.5 శాతం మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అంతకుముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోదీ ఒకరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని చెప్పారు. మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37శాతం ఖర్చు అవుతున్నదని మొన్ననే కాగ్ తన నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోదీ.. ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలి. ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టయినా నిర్మించారా? మరేదైనా జాతీయస్థాయి నిర్మాణం పూర్తిచేశారా? పోనీ పేదల కడుపునింపే ఒక సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టారా? ఇవేవీ చేయనప్పుడు.. ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొకసాలకు చేరిందో మోదీయే జవాబు చెప్పాలి’ అని కేటీఆర్ నిలదీశారు.
మనది సంక్షేమ రాజ్యమని మరిచారా?
ప్రజోపయోగ పనులు చేయకుండా దేశాన్ని రూ.లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచిన వాళ్లే.. ఇప్పుడు పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను తాయిలాలు అంటూ విషం చిమ్మడం ఏమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భారత దేశం ఒక “సంక్షేమ రాజ్యం” అని మన రాజ్యంగంలో రాసుకున్న విషయాన్ని ఆయన ప్రధానికి గుర్తుచేశారు. ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా రాజ్యం(ప్రభుత్వం) పనిచేస్తుందన్న భరోసాను పౌరులకు కల్పించాలన్న రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఉద్దేశాన్ని మర్చిపోరాదని ఆయన హితవు పలికారు.
సంక్షేమ పథకాలనా మీరు వెక్కిరిస్తున్నది..?
ప్రధాని మోదీ ఉచితాలు అంటూ వెకిరిస్తున్నది ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలనేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నల్లచట్టాలు తీసుకొచ్చి రైతులు 13నెలలపాటు రోడ్లమీద నిలబెట్టడమే కాకుండా, 700 రైతుల రైతుల మరణానికి కారణమైన మోదీ ప్రభుత్వానికి రైతుసంక్షేమం అనే మాట కు అర్థం కూడా తెలియదని విమర్శించారు. ‘మోదీజీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బడుగులకు ఒక రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం మీదనేనా మీ అక్కసు? బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సూళ్లలో ఉచితంగా భోజనం పెట్టడం మీదనేనా మీ కండ్లమంట?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాయితీఎత్తేయడానికి మనసెలా వచ్చింది?
గత ఐదేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ను కూడా రీఫిల్ చేయించుకోలేని ప్రజల సంఖ్య 4.13 కోట్లని, కేవలం ఒక సిలిండర్ మాత్రమే కొనగలిగిన వారి సంఖ్య 7.67 కోట్లుగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో గ్యాస్సబ్సిడీని ఎత్తేయాలనే కేంద్ర దుర్మార్గమైన ఆలోచన ఎంతమంది పేదలను ఆకలిమంటల్లోకి పడదోస్తున్నదో మోదీ ఎన్నడైనా ఆలోచించారా..? అని అన్నారు. ‘ప్రధాని గారూ.. వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని ప్రకటించడానికి మీ ప్రభుత్వానికి మనసెలా వచ్చింది? మీ మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న మీ ప్రభుత్వానికి సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్ల రాయితీ కోసం రూ.1500 కోట్లు కేటాయించడానికి చేతులు రావట్లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మూడేండ్లలోనే సుమారు రూ.3 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను రాయితీలు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన విమర్శించారు. బడాబాబులకు రూ.10లక్షల కోట్లకు పైగా బ్యాంకులోన్లు నిశ్శబ్దంగా రైట్ఆఫ్ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చిన్న, సన్నకారు రైతుల రుణాల విషయానికి వచ్చేసరికి స్వరం మార్చిందని దుయ్యబట్టారు.
గర్భిణిలకు ఆరోగ్యలక్ష్మి వంటి పథకాల ద్వారా పోషకాహారం అందించడం, అమ్మఒడి వాహనాల్లో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ప్రసూతి అనంతరం కేసీఆర్ కిట్ ఇవ్వడం, రూ.13 వేల నగదును అందించడం ఎలా వృథా ఖర్చు అవుతుందో మోదీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘మోదీజీ.. తాగేందుకు గుకెడు నీళ్లు లేక తండ్లాడిన నేలమీద, ఫ్లోరైడ్ విషంతో బొకలు అరగదీసిన గడ్డ మీద మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ఉచితంగా తాగునీరివ్వడం మీకు రుచించడం లేదా? సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు చేయూత అందించడం తప్పా? సమాజంలో వివక్షకు గురైన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తెచ్చిన దళితబంధు పథకం అవసరం లేదంటున్నారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
కాకులను కొట్టి గద్దలకు వేస్తారా?
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. పేదలు, రైతులు, బడుగు బలహీనవర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో, కేంద్రప్రభుత్వ పరిధిలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా.. లేదా..? అనేది దేశప్రజలకు స్పష్టంచేయాలని కేటీఆర్ సూచించారు. ‘సంపద పెంచాలె – పేదలకు పంచాలె అన్నది సీఎం కేసీఆర్ నినాదం. కానీ మీకు సంపద పెంచడం మాత్రం చేతకాదు. పేదలకు సంక్షేమం కోసం దాన్ని ఖర్చు చేయడానికీ మనసు రాదు’ అని పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల తరుణంలో.. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశాక ప్రధాని చేసే ప్రసంగంలో పేదల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.