హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఇవాళ తెలంగాణభవన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పలువురు నాయకులు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.
ఒక్క బస్తా యూరియా కోసం కూడా భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఖరికి క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో యూరియా కోసం కుస్తీలు లేవని, విత్తనాల కోసం పోటీ లేదని, కరెంటు కష్టాలు లేవని, క్రాప్ హాలిడేలు లేవని కేటీఆర్ చెప్పారు.
పెండింగ్ పనులు పూర్తిచేస్తే కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోననే అక్కసుతోనే సీఎం రేవంత్రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టిండని కేటీఆర్ ఆరోపించారు. కేవలం 10 శాతం పనులు పూర్తిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నా.. ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తే కేసీఆర్కు పేరొస్తది, తన బాస్ (చంద్రబాబు) కు కోపం వస్తదనే భయంతోనే రేవంత్రెడ్డి రైతులను గోసపెట్టుకుంటున్నడని మండిపడ్డారు.