KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే.. బీఆర్ఎస్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే.. తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక అవసరమైతే నిలబడాలి.. కలబడాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్ఎస్కే మాత్రమే. కాంగ్రెస్, బీజేపీతో ఎంత మాత్రం కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్’ అన్నారు.
‘తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్.. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. గత పదేళ్ల కార్యాచరణ చూస్తే పార్లమెంట్ చూస్తే తెలంగాణ అనే మాట ప్రతి సమయంలో ప్రతిధ్వనించిందంటే.. దానికి బీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలో వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. కాంగ్రెస్, బీజేపీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రంగా చూస్తాయి. కానీ, మాకు ఎపీ సెంటర్. మేం కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు ప్రధాన కేంద్రం హైదరాబాద్, తెలంగాణ. మా ప్రధాన ఎజెండానే తెలంగాణ కాబట్టి.. తెలంగాణ కోసం.. సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమే. అందుకే అంటున్న తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్. అందుకే పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా.. ఏ అంశంపై లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది.. పోరాడగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు.
‘ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఓ ప్రత్యేకమైన రాజకీయ అస్థిత్వం ఉంటుంది. ప్రతి పార్టీకి ఓ ప్రత్యేకమైన అస్థిత్వం ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును.. గౌరవాన్ని తెచ్చే లీడర్ ప్రతి రాష్ట్రానికి ఉంటారు. సొంత బలంతో, గట్టి గళంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. బెంగాల్లో అనగానే గుర్తించేది మమతా బెనర్జీ. తమిళనాడు అనగానే గుర్తుకు వచ్చేది డీఎంకే స్టాలిన్.. లేదంటే అన్నా డీఎంకే పార్టీ గుర్తుకు వస్తుంది. ఏపీ అంటే గుర్తుకు వచ్చేది జగన్.. చంద్రబాబు నాయడు. అక్కడ రెండు పార్టీలదే అక్కడ ప్రభావం ఉన్నది. ఒడిశా అనగానే గుర్తుకు వచ్చేది నవీన్ పట్నాయక్. బీహార్ అంటే గుర్తుకు వచ్చేది నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర అనగానే గుర్తుకు వచ్చేది శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే. తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది భారతదేశమంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తుకు వచ్చే రూపం కేసీఆర్, బీఆర్ఎస్’ అని తెలిపారు.
‘ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లాడినా నిర్వివాదమైన అంశం.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదు. పవర్ఫుల్ నేతలతో ఆయా రాష్ట్రాలకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్తో తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది.. ఆ రాష్ట్రానికి అస్థిత్వం వచ్చింది. తెలంగాణ అనే పదానికి పర్యాయపదంగా కేసీఆర్ మారారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా.. పార్లమెంట్లో ఫోర్త్స్థాయి ఎంప్లాయ్ నుంచి ప్రధానిమంత్రి దాకా అందరినీ కలిశారు. ఆయనను చూడగానే తెలంగాణ గుర్తుకు వస్తుందనే విధంగా కేసీఆర్ ఎక్కని కడప లేదు.. మొక్కని బండ లేదు అన్నట్లు ఆ నాడు విస్తృతంగా ఢిల్లీలో ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లే రాష్ట్రం సాకారమైన విషయాన్ని గుర్తు చేస్తున్నా’నన్నారు.