రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): భవిష్యత్లో వరద ఇబ్బందులు రావొద్దని, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. నాలాలపై ఇండ్ల నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొదని తెలిపారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజ ల్లో అవగాహన కల్పించాలని సూచించారు. భారీవర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల పట్టణంలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. వరదనీటిలో నడుస్తూ బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన కు టుంబాలకు పరిహారం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు. వరద సహాయక చర్య లు చేపట్టిన డీఆర్ఎఫ్ టీంను అభినందించారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ వరద పరిస్థితిపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో వరదల ఇబ్బంది కలుగకుండా ప్రణాళికలు రూపొందించి ప్ర భుత్వానికి నివేదిక పంపాలని మంత్రి ఆదేశించారు.
రోడ్ల మరమ్మతులకు 1.35 కోట్లు
వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.1.35 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్ని మురుగునీటి కాలువలు నిర్మించాలో ప్రణాళికలు సిద్ధంచేయాలన్నారు. నాలాలపై ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించి.. బాధితులను డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించాలని సూచించారు. ఇల్లుకూలి మరణించిన వ్యక్తి కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని ఆర్డీవోను ఆదేశించారు. పంటలు నష్టపోయిన రైతులకు వారంలోగా పరిహారం అందేలా చూడాలని కలెక్టర్కు సూచించారు. వేములవాడలో వర్షానికి కూలిన బ్రిడ్జి సెంట్రింగ్పై వివరాలు తెలుసుకున్న కేటీఆర్.. వచ్చే శివరాత్రి వరకు నిర్మాణం పూర్తికావాలన్నారు.
తేరుకుంటున్న సిరిసిల్ల
మూడ్రోజులు ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల క్రమంగా తేరుకుంటున్నది. జిల్లావ్యాప్తంగా రికార్డుస్థాయిలో 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం జలసంద్రమైంది. అన్ని చెరువులు నిండి మత్తళ్లు దుంకడంతో వరద తీవ్రత పెరిగింది. ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో చిక్కుకోవడంతో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, సెస్ అధికారు లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చే పట్టారు. కలెక్టరేట్ ఆవరణలో నిలిచిన నీటిని మానేరులోకి వెళ్లేలా ఏర్పాట్లుచేశారు. పాతబస్టాండ్ సమీపంలోని సంజీవయ్య విగ్రహం వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు మురుగుకాలువలో పడి గల్లంతైన సంజీవయ్యనగర్కు చెందిన పెరుమాండ్ల దేవయ్య(54) మృతదేహాన్ని పోలీసులు బయటకుతీశారు. అతడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ తక్షణ సాయం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.4 లక్షలు మంజూరు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ దేవయ్య నివాసానికి వెళ్లి సాయం చెక్కును అందజేశారు.