హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జాహ్నవి కందుల మృతికి కారణమైన అమెరికా పోలీస్ అధికారిని సాక్ష్యాధారాలు లేవంటూ అభియోగాలు నమోదుచేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకు జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.