హైదరాబాద్: ఉచితంగా ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తమ హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడపగడపకు చేరితే.. కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ ఎల్ఆర్ఎస్ అని మభ్యపెట్టి, గద్దెనెక్కగానే నాలుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ.1400 కోట్లను ముఖ్యమంత్రి ముక్కుపిండి వసూలుచేశారు. మరో రూ.15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి ఖజానా నింపుకునేందుకు గడుపు పెంపు పేరిట మరో ఘరానా దోపిడీకి తెరలేపారు. నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్లో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.