KTR | కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, జనవరి 14: తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలినా పార్టీ యంత్రాంగం మొత్తం కదిలివస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న పదేండ్లలో ఎన్నడూ హింసా సంస్కృతిని ప్రోత్సహించలేదని చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో గత నెల 29న రాజకీయ కక్షలతో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేశ్యాదవ్ను హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ, ఎస్పీ గ్రామాన్ని స్వయం గా సందర్శించి, మల్లేశ్ హత్యలో పాల్గొన్న నేరస్థుల కాల్డాటా రికార్డును పరిశీలించి, ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి గంట్రావుపల్లిలోని మల్లేశ్యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షల చెక్కును మల్లేశ్ కుటుంబసభ్యులకు అందజేశారు.
మృతుడి భార్య నిర్మలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశం కల్పిస్తామని, పిల్లల చదువుల బాధ్యతను పార్టీ స్వీకరిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేశ్ బీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లేశ్ హత్య సంఘటనపై పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని, వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించాలని సూచించడంతో తాము ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. మల్లేశ్ రాజకీయ హత్యను భూ వివాదానికి సంబంధించిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదనే అనుమానం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న పదేండ్లలో రాష్ట్రంలో ఎప్పుడూ రాజకీయ హత్యలు, దాడులు, హింసాత్మక సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు.
మల్లేశ్ది రాజకీయ హత్యే
కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులు కక్షలు, కార్పణ్యాలతో మల్లేశ్ను హత్య చేశారని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఇలాంటి హత్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దాడులు, హత్యలు, హింసా సంస్కృతి మంచిది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావుకు హితవు చెప్పారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ, నాయకుల మీద కానీ దాడులకు తెగబడలేదని, ఇలాంటి సంస్కృతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. తాము కూడా దుష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ప్రభుత్వంలో ఎవరున్నా ఇలాంటి దుర్మార్గమైన నేరానికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని, మల్లేశ్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రారంభమైన హత్య రాజకీయాలు, రాజకీయ హింసా సంస్కృతిని మీడియా ప్రజల ముందుంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, అలంపూర్, కోరుట్ల ఎమ్మెల్యేలు విజయుడు, సంజయ్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్రావు, గుజ్జుల పరమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గణేశ్రావు, రాజశేఖర్గౌడ్, రామచందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆల కుటుంబానికి పరామర్శ
భూత్పూర్: మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్లో ఆదివారం శశివర్ధన్రెడ్డికి ఏకాదశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. శశివర్ధన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శశివర్ధన్రెడ్డి తల్లి వరలక్ష్మి, భార్య శ్రీలతను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, గువ్వల బాలరాజు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాల్యానాయక్, ఇంతియాజ్ ఇషాక్, రజిని, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, గుంత మౌనిక, రమాశ్రీకాంత్, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, కాటం ప్రదీప్గౌడ్, చంద్రశేఖర్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కేటీఆర్ రాకను తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నాసాగర్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేసే అవకాశం: కేటీఆర్
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో మరోసారి కలిసి పనిచేస్తాయనడానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ తోడ్పాటును అందించిందని ఉదహరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.