హైదరాబాద్: ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని వెల్లడించారు. 2012 నుంచి 14 వరకు చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్లకు వచ్చారని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని చెప్పారు. శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలిపారు. మాజీ స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి నెలకొల్పిన సాంప్రదాయాలను, కాపాడిన విలువలను పరిరక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. దురదృష్ట వశాత్తు గాయపడటంతో ఆయన సభకు రాలేకపోయారని చెప్పారు. ఈ సభ అందరిదని, ప్రతి సభ్యుడి హక్కులను కాపాడేలా, ప్రజల తరఫున మాట్లాడేవారి గొంతును వినిపించేలా బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తి్స్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.