హైదరాబాద్ సిటీబ్యూరో,సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తవుతాయని, అప్పటినుంచి 100 శాతం మురుగు రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. నగరంలో పలు చోట్ల జలమండలి చేపట్టిన ఎస్టీపీల నిర్మాణం పనులను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కొత్తగా కొనుగోలుచేసిన సేఫ్టీ ప్రొటోకాల్ వాహనాలను నానక్రాంగూడలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో మురుగునీటి నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నదని చెప్పారు. వీటితో శుద్ధిచేసిన నీరు మాత్రమే కాలువలు, మూసీలోకి వెళ్తుందని అన్నారు. మురుగునీటి పారుదల పనులు నిర్వహించే చోట ప్రత్యేక పారిశుద్ధ్య వ్యవస్థను జలమండలి అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఫతేనగర్లో నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణం పనులను స్వయంగా పరిశీలించి, తర్వితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎస్టీపీల నిర్మాణాల వల్ల చుట్టు పక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీటి వల్ల దుర్వాసన రాకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎస్టీపీల ప్రాంగణాల్లో హెచ్ఎండీఏ సహకారంతో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు.