KTR | ప్రజల సమస్యలే ఎజెండాగా పని చేద్దామని.. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్
ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కేటీఆర్ పాల్గొని, పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలాస్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తాం అంటున్నారని.. దానిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్లలో ఒక్క పాఠశాల, ఒక్క కళాశాల తీసుకొచ్చాడా ? ఓ గుడి కట్టాడా ? ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. రూపాయి పని చేయని బండి సంజయ్కి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోదీ పదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు.
తెలంగాణకు ఏమి చేయని బీజేపీకి, కరీంనగర్కు నయాపైసా పని చేయని బండి సంజయ్కి ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుందన్నారు.
ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారన్నారు. కష్టకాలంలో తన వెంట నిలిచిన నాయకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భవిష్యత్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడుతానన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరూ కూడా అధైర్యపడొద్దని.. అందరికీ అండగా ఉంటానన్నారు.