KTR | కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, పార్టీ జిల్లాశాఖల అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మొన్నటి వరకు ప్రధాని, అదానీ ఒకటే అని రేవంత్రెడ్డి మాట్లాడారని, ఇవాళ దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారన్నారు. బీజేపీ ఆదేశాల మేరకు అదానీతో రేవంత్రెడ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పుడూ గుర్తు చేయాలన్నారు. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించామన్నారు.