దివ్యాంగురాలి వివరాలు ఇవ్వండి.. ఏఎన్ఐని కోరిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగురాలు. ఎడమ కాలు లేదు. అయినప్పటికీ రోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు ఒంటి కాలు మీదనే వెళ్తున్నది. ఈ మధ్యే ఆ బాలిక ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘నాకు కృత్రిమ కాలు ఇవ్వాలని అడుగుతున్నా రాజస్థాన్ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నా.
నాకు నా కలలను వదులుకోవడం ఇష్టం లేదు. భవిష్యత్తులో డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం’ అని తెలిపింది. ట్విట్టర్లో ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఆమె వివరాలు ఉంటే ఇవ్వాలని ఏఎన్ఐని కోరారు. ప్రియాంషుకుమారి తన కలలను సాకారం చేసుకొనేందుకు వ్యక్తిగతంగా తనవంతు సాయం చేస్తానని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. గతంలో పంజాబ్కు చెందిన మూగ, బధిర చెస్ క్రీడాకారిణి మాలికకు మంత్రి కేటీఆర్ ఇదే తరహాలో సాయం చేశారు. ఆమె పరిస్థితి గురించి తెలుసుకొన్న కేటీఆర్ ఆమెను హైదరాబాద్కు పిలిపించుకొని రూ.15 లక్షల ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా లాప్టాప్ను బహూకరించి, సన్మానించారు.