హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో గత 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రంగంలో తెలంగాణ జాతీయ సగటుకు మించి పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. గత తొమ్మిదేండ్లలో ఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దిడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గురువారం శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీలో జరిగిన సింజీన్ ఆర్ అండ్ డీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వంటి విభిన్న రంగాల్లో బెంగుళూరు, హైదరాబాద్ నగరాలు దూసుకుపోతున్నాయని, ఈ రెండు నగరాల మధ్య లైఫ్ సైన్సెస్ కారిడార్ అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జీనోమ్ వ్యాలీ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ సగటు కంటే 23 శాతం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నామని వివరించారు. రూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సింజీన్ సంస్థ హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని అన్నారు. దీంతో మరో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సింజీన్లో పనిచేస్తున్నవారిలో 90 శాతం తెలంగాణవారే ఉండటం గర్వించదగిన విషయమని అన్నారు. కొత్త డ్రగ్స్ ఆవిష్కరణలో సింజీన్ విశేష కృషి చేస్తున్నదని, ఎన్నో లైఫ్ సేవింగ్ మందుల తయారీలో ముఖ్య భూమిక పోషిస్తున్నదని కొనియాడారు. పెట్టుబడిదారులే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, చాంపియన్లుగా మారుతారని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణలో విద్య, పరిశ్రమలు, పాలసీలను మలుస్తున్నామని తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద హబ్గా నిలిచిన జీనోమ్ వ్యాలీలో 200కు పైగా కంపెనీలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 వేలకు పైగా సైంటిఫిక్ నిపుణులు ఇక్కడ సేవలందిస్తున్నారని చెప్పారు. నోవార్టిస్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డ్యూపాంట్, యాష్ల్యాండ్, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా, లోంజా వంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలతో గ్లోబల్ హబ్గా నిలుస్తున్నదని, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, బయోటెక్ కంపెనీలకు నిలయంగా నిలుస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ అధికారులు, సింజీన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు.