హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) ః పౌరులకు పారదర్శక, అవినీతి రహిత సేవలను అందించేదిశగా పురపాలకశాఖలో పలు సంస్కరణలను తీసుకువచ్చినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మున్సిపాలిటీల్లో 50వేలకు పైగా జనాభా ఉన్న ప్రతివార్డుకు ఒకరు చొప్పున.. 50వేల కంటే తక్కువ ఉన్నచోట రెండు వార్డులకు ఒకరు చొప్పున అధికారిని నియమిస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఉన్నట్టుగానే ప్రతి వార్డుకు ఒక అధికారి ఉంటారని, తద్వారా పురపాలనకు కొత్తశక్తి వస్తుందని కేటీఆర్ చెప్పారు. కౌన్సిలర్, కార్పొరేటర్ అధికారితో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు జరగనున్న పట్టణ ప్రగతిపై శుక్రవారం హైదరాబాద్ వెంగళరావునగర్లోని ట్రాన్స్ ఆడిటోరియంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి ఆయన పట్టణ ప్రగతి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇండ్లు, భవనాల అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ చట్టాన్ని తీసుకువచ్చామని, ఇది పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన కేటీఆర్.. కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు.
పది అంశాలు లక్ష్యంగా పెట్టుకోవాలి
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10 అంశాలను పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. 2023 మార్చి నెలాఖరుకల్లా లక్ష్యాలను పూర్తిచేసేలా తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ, అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని ఆయన సూచించారు.
ప్రతి పని దగ్గర బ్యానర్ కట్టండి..
పట్టణాలు, నగరాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, నిర్మాణాల వద్ద ‘ప్రజల పన్నులతో చేపట్టిన పనులు’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దీనిద్వారా తాము చెల్లించే పన్నులతో ఈ పనులు చేపడుతున్నారన్న భావన వారిలో కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ వార్షిక నివేదికను విడుదల చేయాలని, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, ఏ పనికి ఎంత ఖర్చు చేశారనేదానిని పుస్తక రూపంలో ఫొటోలతో సహా ప్రచురించాలని కేటీఆర్ సూచించారు. దీనిద్వారా పాలనలో జవాబుదారీతనం పెరుగడమే కాకుండా, ప్రభుత్వం ఏయే పనులు చేపడుతున్నదో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి మున్సిపాలిటీ తన పరిధిలో చేపట్టిన అభివృద్ధిని పౌరుల ముందుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణాల నుంచే అత్యధిక ఆదాయం..
రాష్ట్రంలో ఇప్పటికే 46 శాతం జనాభా పట్టణాల్లో ఉందని, రానున్న రోజుల్లో ఇది 50 శాతం దాటుతుందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నదని తెలిపారు. దేశానికి , రాష్ర్టానికి ఆర్థిక చోదకశక్తులు పట్టణాలేనని అన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో 65- 70 శాతం పట్టణాల నుంచే వస్తున్నదని చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణతో ప్రభుత్వాలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, తగిన కార్యాచరణతో దానిని అధిగమించవచ్చునని మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏ విధమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంటూ సీఎం కేసీఆర్ పదే పదే అడుగుతుంటారని, పట్టణాలను మెరుగ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో పల్లెలు బాగున్నాయని సీఎం కేసీఆర్ అంటుంటారని, పట్టణాలు కూడా బాగున్నాయనేలా ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణ మున్సిపాలిటీలు ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించిన మంత్రి కేటీఆర్.. రెట్టిం పు సంఖ్యలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చేలా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మున్సిపల్ అధికారులు, పాలకవర్గాలకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణప్రగతి పురస్కారాలు ప్రదానం
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 2021-22 సంవత్సరానికిగాను పట్టణ ప్రగతి పురస్కారాలను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మొత్తం ఐదు కేటగిరీల్లో 20 మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీలు విన్నూతంగా చేపడుతున్న కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. సూర్యాపేటలో ఇంట్రిగేటెడ్ మార్కెట్ అద్భుతంగా నిర్మిస్తున్నారని కితాబిచ్చిన మంత్రి కేటీఆర్ ..అక్కడి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ను అభినందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ రూపొందించిన వస్తువులను ఇంక్వాష్ హబ్ కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారని ఆయన ప్రశంసించారు. ఇల్లందు పట్టణంలో చేపట్టిన పనుల వివరాలతో వార్షిక నివేదికను పుస్తకరూపంలో విడుదల చేయడంపై మున్సిపల్ చైర్మన్ డీవై గిరిని కేటీఆర్ అభినందించారు. నారాయణపేటలో మెయిన్రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దడాన్ని కేటీఆర్ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పీర్జాదిగూడ కార్పరేషన్లో ఒకే దగ్గర మూడు మతాల వైకుంఠధామాలను నిర్మించడం తనను అబ్బురపరిచిందని ఆయన తెలిపారు. బయో మైనింగ్లో వరంగల్ కార్పొరేషన్ చేపడుతున్న పనులు బాగున్నాయని అభినందించారు.
కౌన్సిల్ సమావేశాల్లో దూషణలెందుకు..?
మున్సిపల్ , నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని కేటీఆర్ చెప్పారు. అధికారుల మీద అరవడం, దూషించడం కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అలవాటుగా మారిందని, వారిని తిట్టడమంటే మన వాళ్లను మనమే అవమానించుకున్నట్లని ఆయన అన్నారు. అధికారుల దగ్గర మంత్రదండమో, అల్లాఉద్దీన్ అద్భుతదీపమో ఉండదని, వారు తమ పరిమితులకు లోబడే పనిచేస్తారని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాల్లోకి కెమెరాలను అనుమతించకుండా, సమావేశం ముగిసిన తరువాత మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలుపడం ద్వారా కొంతవరకు సమస్య తగ్గుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పట్టణాలకు పది లక్ష్యాలివీ..