హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ‘యువత కేవలం ఓటర్లుగానే కాదు, దేశ భవిష్యత్తును నిర్దేశించే నాయకులుగా ఎదగాలి. రాజకీయాలపై ఉన్న అపోహలను వీడి, వ్యవస్థలో భాగస్వాములు కావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, దేశ నిర్మాణంలో చేంజ్ మేకర్స్గా ఎదగాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని ప్రముఖ విద్యార్థి స్వచ్ఛంద సంస్థ స్ట్రీట్కాజ్ బంజారాహిల్స్లో మంగళవారం నిర్వహించిన ‘షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ లీడర్స్’ నాయకత్వ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. 50కి పైగా కళాశాలల నుంచి సుమారు 300 మంది జెన్-జీ వలంటీర్లు పాల్గొన్న ఈ సదస్సులో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలపై విస్తృతంగా చర్చించారు. నేటి ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై లోతైన చర్చ జరిగింది.
రాజకీయ నాయకులపై జెన్-జీ యువతలో ఉండే సాధారణ అపోహల గురించి జరిగిన ‘మిత్ వర్సెస్ ఫ్యాక్ట్’ సెషన్ ఆసక్తికరంగా సాగింది. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ, పాలన, ప్రజా జీవితంలోని వాస్తవాలను వివరించారు. నాయకత్వం, పాలన, వ్యవస్థాపకత, దేశ నిర్మాణంలో యువత పాత్రపై కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కేటీఆర్ తన బాల్య స్మృతులను, నాయకత్వ దృక్పథాన్ని ప్రభావితం చేసిన సందర్భాలను విద్యార్థులతో పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూనే యువత మార్పు తెచ్చే చేంజ్ మేకర్స్గా ఎదగాలని, దేశ అభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మాక్ షార్ ట్యాంక్’లో విద్యార్థులు సమర్పించిన వినూత్న ఆలోచనలను కేటీఆర్ ఒక ఇన్వెస్టర్ తరహాలో పరిశీలించి మార్గదర్శకత్వం అందించారు. ఒక వలంటీర్ కేటీఆర్ నాయకత్వ ప్రస్థానాన్ని వివరిస్తూ సమర్పించిన ర్యాప్ ప్రదర్శన యువతను ఆకట్టుకున్నది. స్ట్రీట్కాజ్ సంస్థ సాగిస్తున్న 17 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానానికి మద్దతుగా, కేటీఆర్ ఆ సంస్థకు రూ.17 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సంస్థకు సలహాదారుగా ఉండేందుకు కూడా అంగీకరించారు. ఇదే వేదికపై విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డొనేట్ స్ట్రీట్కాజ్ అనే వెబ్సైట్ను కేటీఆర్ ప్రారంభించారు.
2009లో ఏర్పాటైన స్ట్రీట్కాజ్ సంస్థ సామాజిక మార్పులో అగ్రగామిగా ఉన్నది. ఇప్పటివరకు రూ.6 కోట్లకుపైగా వ్యయంతో 15 వేల ప్రాజెక్టులు పూర్తి చేసి, 13 లక్షల మందికిపైగా జీవితాల్లో వెలుగులు నింపింది. 4,000 మంది క్రియాశీల వలంటీర్లు, 45,000 మందికి పైగా పూర్వ సభ్యుల బలమైన నెట్వర్తో ఈ సంస్థ దేశంలోని పలు నగరాల్లో ఉనికి చాటుకుంటూ జాతీయ స్థాయి ఎన్జీవోగా విస్తరించింది. సామాజిక అభివృద్ధిలో ప్రతిభ చూపిన వలంటీర్లకు అవార్డుల ప్రదానంతో వేడుక ముగిసింది.