హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేమని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిషరణలను మోదీ గాలికొదిలేశారని విమర్శించారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని హితవుపలికారు. ముంబైలో శనివారం సాయంత్రం ‘ఎన్డీటీవీ యువ- 2025-ది ముంబై చాప్టర్’ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జెన్-జెడ్ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర వంటి అంశాలపై తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు.
అపారమైన బాధ్యతతో పనిచేయాలి
ప్రస్తుత తరం యువత (1997-2012 మధ్య జన్మించినవారు జెన్-జెడ్) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. జెన్-జెడ్ శక్తిని తకువ అంచనా వేయవద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీభూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ మెడలు వంచిన విషయాన్ని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందని చెప్పారు. ఇదే జెన్-జెడ్ జనరేషన్ పవర్ అని అన్నారు. సోషల్మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రావాలని పిలుపునిచ్చారు. ‘రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరు?’ అని యువతను కేటీఆర్ ప్రశ్నించారు.
అత్యుత్తములతో పోల్చుకోవాలి
ప్రపంచం అంతా ముసలితనంలో మూలుగుతుంటే భారతదేశం మాత్రం యువరక్తంతో ఉరకలెత్తుతున్నదని కేటీఆర్ అన్నారు. దేశంలో సగటు వ్యక్తి వయస్సు 27 సంవత్సరాలని, 50% జనాభా 35 ఏండ్లలోనే ఉన్నారని చెప్పారు. ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దాదాపు సమానంగా ఉండేవని గుర్తుచేశారు. ‘అప్పుడు చైనా తలసరి ఆదాయం 300 డాలర్లు అయితే మనది 500 డాలర్లు. కానీ, 40 ఏండ్ల తర్వాత చూస్తే, ఇండియా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకే పరిమితమైంది. కానీ, చైనా 20 ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది. ఇవాళ చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లు అయితే మనది కేవలం 2,700 డాలర్లే. చైనా మనల్ని ఎలా దాటిపోయిందో ప్రతి ఒకరూ ఆలోచించాలి. మనం ఎప్పుడైనా అత్యుత్తములతో పోల్చుకోవాలి. అమెరికా, యూరప్లతో చైనా పోటీపడితే, మనం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్తో పోల్చుకుని మురిసిపోతున్నాం’ అని ఎద్దేవా చేశారు.
విధ్వంసం నుంచి వికసించిన జపాన్
అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్.. కేవలం 23 ఏండ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రపంచంలో న్యూక్లియర్ దాడి జరిగిన ఏకైక దేశం జపాన్ అని, భూకంపాలు, సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడిందని చెప్పారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా జపాన్ కుంగిపోలేదని అన్నారు. ఎన్నో భౌగోళిక అనుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వాటన్నింటినీ తట్టుకుని అద్భుత ఆవిషరణలు, పారిశ్రామికీకరణతో నేడు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగిందని పేర్కొన్నారు. జపాన్ సాధించినప్పుడు భారత్ ఎందుకు సాధించలేకపోయిందో ప్రతి ఒకరూ ఆలోచించాలని కోరారు. జపాన్ ఆలోచన విధానమే కారణమని, వచ్చే పదేండ్లలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినా ఆశ్చర్చపోవాల్సిన పనిలేదని చెప్పారు.
తెలంగాణ చేసింది.. భారత్ ఎందుకు చేయలేకపోయింది?
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్ సోదాహరణలతో వివరించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది. ప్రపంచంలోనే అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్లో ఉన్నది. కేవలం పదేండ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది? ఒకసారి ఆలోచించాలి’ అని కేటీఆర్ సూచించారు. ‘సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ నారాయణ్ వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈవోలు అయితే మనం సంతోషిస్తాం. కానీ, మన దేశం నుంచి ఒక ప్రపంచస్థాయి ఆవిషరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని కేటీఆర్ చురకలంటించారు. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలని సూచించారు. మనదేశంలోని 38 కోట్ల జెన్-జెడ్ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచగతిని మార్చేందుకు ప్రభుత్వాలతో, పరిశ్రమలతో కలిసి పనిచేయాలని కోరారు.‘పెట్టుబడి లేకపోవడం కాదు.. మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయి’ అని యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు.