హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ గేయరచయిత డాక్టర్ కందికొండ(కందికొండ యాదగిరి)కు అండగా ఉంటామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కందికొండ కుమార్తె మాతృక మంత్రి కేటీఆర్కు ఓ లేఖను ట్వీట్ చేసింది. ఈ ఏడాది జూన్లో తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి సాయంచేసి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపింది. ‘నాన్న వెంటిలేటర్పై కిమ్స్ దవాఖానలో ఉన్నప్పుడు చికిత్స అందేలా చర్యలు తీసుకొని ఆర్థికంగానూ ఆదుకొన్నారు. వెన్నెముక ఆపరేషన్కు మెడికవర్ దవాఖానలో చేరితే మీ కార్యాలయం వేగంగా స్పందించింది. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులున్నాయి. మోతీనగర్లో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల తరువాత ఇల్లు ఖాళీ చేయాలని యజమాని చెప్పారు. మా విన్నపాన్ని మన్నించి చిత్రపురి కాలనీ లేదా ఇంకెక్కడైనా నివాసం కల్పించాలి’ అని ట్వీట్ చేసింది. చిత్రపురి కాలనీలో సొంత ఇంటి కోసం రూ.4.05 లక్షలు అడ్వాన్స్గా కట్టామని, ఆర్థిక ఇబ్బందులతో మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయామని పేర్కొన్నది. సాయం చేయాలని సీఎం కేసీఆర్కు సైతం విన్నవించుకున్నది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ “తప్పకుండా మాతృక. గతంలో మీ కుటుంబానికి అండగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఉంటాం. నా బృందం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కార్యాలయంతో సంప్రదించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకుంటుంది” అంటూ ట్వీట్ చేశారు. “థ్యాంకూ.. నేను మీ రిప్లయ్ని మా నాన్నకు చూపించా. ఆయన ఆనందించారు. మా కుటుంబానికి వెలుగునిచ్చే దీపంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఒక కుటుంబంగా మేము మీకు, మీ అందమైన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అంటూ మాతృక రిప్లయ్ ఇచ్చింది.