హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): విద్యతోపాటు విజ్ఞానాన్నీ బోధించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యాబోధనలో వినూత్న పద్ధతులు అవలంబించాలని, పాఠాలకు ఆహ్లాదాన్ని జోడించాలని చెప్పారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో టీశాట్ ఆరో వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీశాట్, ఆహా మధ్య ఒప్పందం కుదిరింది. ఉస్మానియా యూనివర్సిటీతోనూ టీశాట్ మరో ఒప్పందం చేసుకున్నది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి మన టీవీ ఉండేదని, కేవలం 8,800 గ్రామాల్లో మాత్రమే ప్రోగ్రామ్స్ వచ్చేవని తెలిపారు. అవి కూడా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో ఉండేవని, అందులో కొన్ని పనిచేసేవని, ఇంకొన్ని మొక్కుబడిగానే ఉండేవని వివరించారు.
తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. టీశాట్ సమర్థంగా పనిచేసేందుకు దాన్ని శైలేష్రెడ్డికి అప్పగించామని, ఆయన నేతృత్వంలో టీశాట్ బృందం ఎన్నో అద్భుతాలు చేసిందని తెలిపారు. విద్యతోపాటు నైపుణ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో టీశాట్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నదని అన్నారు. టీశాట్ ఆలోచనలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరించిందని పేర్కొన్నారు. టీశాట్ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలనే సదుద్దేశంతో కేబుల్ (లోకల్ నెట్వర్క్)తో కలిసి పనిచేశామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల ఇండ్లలో టీశాట్ చానల్ ప్రసారం అవుతున్నదని, ఇది అందరికీ గర్వకారణమని తెలిపారు. విద్యావిధానం, టెక్నాలజీతో పాటు అన్నీ మారుతున్నాయని, దానికి అనుగుణంగా పుట్టుకొచ్చింటే టీశాట్ యాప్ అని చెప్పారు. టీశాట్ యాప్కు 40 లక్షల మంది రిజిస్టర్ యూజర్స్ ఉన్నారని, దాదాపు 10 వేల పైచిలుకు కంటెంట్తో 25 లక్షల డౌన్లోడ్స్ సాధించామని వివరించారు. కరోనా సమయంలో టీశాట్ సేవలు అద్భుతమని కొనియాడారు.
విద్యావిధానంలో సమూల మార్పులు రావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో రోజుకో కొత్త టెక్నాలజీ ఆవిర్భవిస్తున్నదని, దీనికి తగినట్టే విద్యార్థుల ఆలోచన తీరు మారుతుందని తెలిపారు. టీశాట్లో పాఠశాల విద్యకు సంబంధించి 768 గంటల కంటెంట్ అందుబాటులో ఉన్నదని వివరించారు. విద్య, నిపుణ అని రెండు చానళ్లు ప్రారంభించామని తెలిపారు. విద్య చానల్లో విద్యార్థులకు ఉపయోగపడే కంటెంట్, నిపుణలో ఉద్యోగం సాధించడానికి కావాల్సిన కంటెంట్ అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. టీశాట్ తెలంగాణకే పరిమితం కాకూడదని, ప్రపంచంలోని తెలుగు వారందరికీ చేరువ కావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచే యానిమేషన్, మల్టీమీడియాను జోడించాలని సూచించారు.
విద్యతోపాటు విజ్ఞానాన్ని కూడా బోధించాలని కేటీఆర్ తెలిపారు. సామాజిక బాధ్యతను వివరించాలని అన్నారు. ఇన్నోవేటివ్, ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో బోధన ఉండాలని సూచించారు. ప్రైమరీ స్థాయిలోనే పిల్లల్లో మంచిని, సామాజిక బాధ్యతను నాటితే సరికొత్త తెలంగాణను ఆవిష్కరించవచ్చని తెలిపారు. జీమ్యాట్, టోఫెల్ తరహాలోనే 50 ప్రశ్నలతో మాక్ టెస్ట్ తయారు చేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకరిస్తామని తెలిపారు. రాబోయే పదేండ్ల కోసం పటిష్ఠ ప్రణాళికను సిద్ధం చేయాలని టీశాట్ సీఈవో శైలేష్రెడ్డికి సూచించారు. టీశాట్ పాఠాలు ఇకపై ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులోకి వస్తాయని శైలేష్రెడ్డి ప్రకటించారు. ఆహా సీఈవో ఎస్ రవికాంత్ మాట్లాడుతూ తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. టీశాట్ నిపుణ విద్యార్థులకు ఒక వరంలా మారిందని వివరించారు. అనంతరం రాజన్న సిరిపిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత గంగాడి సుధీర్ రచించిన ‘కవనం’ కవితా సంపుటి రెండో పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.