సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలి. గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ పార్టీనే స్వయంగా వీలునామా రాసుకొన్నది. కానీ తెలివిగల్ల తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకొన్న సంగతిని ప్రియాంకగాంధీ తెలుసుకొంటారని ఆశిస్తున్నా.
–మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నగరంలోకి వచ్చే సమయంలో కనిపించే అందమైన రోడ్లు, అద్భుతమైన ఫ్లై ఓవర్లు, కేబుల్బ్రిడ్జి లాంటి అధునాతన నిర్మాణాలు, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలు చూసి పరిపాలనా పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం న్యూయార్ను తలపిస్తున్నదని రజనీకాంత్లాంటి ప్రముఖులు చేసిన ప్రశంసల గురించి కాంగ్రెస్ లీడర్లను అడిగి తెలసుకోవాలని సూచించారు.
నిజాలు చెప్పేందుకు వాళ్లు కాస్త మొహమాటపడొచ్చని, ఒకటికి రెండుసార్లు అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వాళ్లే గుక తిప్పుకోకుండా చెప్తారన్న నమ్మకం ఉన్నదని అన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’లో పాల్గొనేందుకు ప్రియాంకాగాంధీ రానున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరో రాసిచ్చిన స్రిప్ట్ను చదివే కాంగ్రెస్ మార్ సంస్కృతిని పకనబెట్టి.. ఇకడి పరిస్థితులను అధ్యయనం చేయాలని ప్రియాంకాగాంధీకి సూచించారు. ‘ఆవో.. దేఖో.. సీఖో’ అంటూ ఆమెకు వెరైటీగా స్వాగతం పలికారు.
నిరుద్యోగం పాపం ఆ రెండు పార్టీలదే
దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ, కాంగ్రెస్ కారణమని కేటీఆర్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి ఉంటే నిరుద్యోగ సమస్యే ఉండేది కాదని పేర్కొన్నా రు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, యువతను రాజకీయాలకు మాత్రమే వాడుకొన్నదని మండిపడ్డారు. ‘యువ సంఘర్షణ సభ’ పేరుతో తెలంగాణకు వస్తున్న ప్రియాంకాగాంధీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇకడ చేసిన నియామకాలు, కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు చేసిన మంచిని చెబితే బాగుంటుందని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
నిరుద్యోగులను రెచ్చగొడితే సహించబోం
కాంగ్రెస్ నేతలు పదేండ్లుగా అధికారానికి దూరమై ఫ్రస్టేషన్లో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఏపీపీఎస్సీ ద్వారా కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? 9 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసుకోవాలని ప్రియాంకాగాంధీకి సూచించారు. రాత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు ఇంటర్వ్యూల్లో అన్యాయం చేసిన నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా తమ కండ్లమందే కదలాడుతున్నాయని చెప్పారు. నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కాసుల కమీషన్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇప్పుడొచ్చి నీతులు చెబితే ఎవరూ నమ్మరని అన్నారు.
నాడు దుర్భిక్షం.. నేడు సిరుల మాగాణం
కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచిన తండ్లాటను తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తడారిన గొంతులకు ‘మిషన్ భగీరథ’తో జలాభిషేకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సమాజం ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పారు. ఒక పంటకు కూడా సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ చేతకానితనంతో ఒకప్పడు తెలంగాణలో దుర్భిక్ష ఛాయలు కమ్ముకొన్నాయని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో కోటి ఎకరాల సిరుల మాగాణం కల సాకారమైందని, భూతద్దం పెట్టి వెదికినా నాటి దుర్భిక్షం కనిపించదని అన్నారు. ప్రాజెక్టు కట్టకముందే కాలువలు తవ్వి కమీషన్లు జేబులో వేసుకొన్న కాంగ్రెస్ పాలన లెక కాకుండా కాళేశ్వరంను మెరుపువేగంతో పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని పేర్కొన్నారు.
4 ఏండ్లలో ఇంత భారీ ప్రాజెక్టును పూర్తిచేసిన కేసీఆర్ పట్టుదల గురించి ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు చెప్పి.. అకడి ప్రజలకు మేలుచేయాలని హితవుపలికారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుంటే.. తప్పుడు కేసులు వేసి అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిసున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధి చెప్పాలని కోరారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకొనే దుస్థితి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్నదేమోకానీ.. తెలంగాణలో లేదని తెలిపారు. కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చేది కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అని.. ఆ దుస్థితిని రూపుమాపి రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక పాలకుడు కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ. 200 చాలీచాలని పింఛన్తో ఇబ్బందులుపడ్డ బతుకులు కేసీఆర్ ఇస్తున్న రూ.2 వేలతో ఆత్మాభిమానాన్ని నింపుకొన్నాయని తెలిపారు.
బలిదేవత అని తిట్టిన వ్యక్తికే పీసీసీ పీఠం!
2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే వందలాదిమంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగేవి కాదన్న సత్యాన్ని ప్రియాంకగాంధీ తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. సుదీర్ఘ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడకుండా, ఇప్పుడొచ్చి మాట్లాడితే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం నమ్ముతుందన్న భ్రమలో ఉండొద్దని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాగుతున్న మానవీయ పాలన గురించి అధికారంలో ఉన్న ఒకటి అరా కాంగ్రెస్ ప్రభుత్వాలకు సోదాహరణంగా వివరించి ప్రజల మెప్పు పొందాలని ప్రియాంకగాంధీకి సూచించారు. సోనియాగాంధీని బలిదేవత అని తిట్టిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని అన్నారు. గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ స్వయంగా వీలునామా రాసుకొన్నదని ఎద్దేవా చేశారు. కానీ తెలివిగల్ల తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకొన్న సంగతిని పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంకగాంధీ తెలుసుకొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. లక్షలాది పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. ఢిల్లీ నుంచి వచ్చే ప్రియాంకగాంధీలాంటి పొలిటికల్ టూరిస్టులకు కూడా స్వాగతం పలుకుతున్నది. అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకాగాంధీ తన ఈ పొలిటికల్ టూర్ను ఎడ్యుకేషన్ టూర్గా మార్చుకోవాలి.
-కేటీఆర్
పెట్టుబడికే కాదు పంట నష్టపోయినా అన్నదాతకు రూ.10 వేల సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే. కాంగ్రెస్ రాబందు పాలనకు, కేసీఆర్ రైతుబంధు పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను తెలంగాణ సమాజం ఎప్పుడో గుర్తించింది.
-కేటీఆర్
నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది యువత ప్రాణ త్యాగాలకు కారణమైన కాంగ్రెస్ ముందుగా ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ ఉద్యమంలో యువకుల బలిదానాలకు కారణం అప్పటి కాంగ్రెస్ అధినాయకత్వమే అని.. సోనియాగాంధీని బలిదేవత అని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్న మాటలను పరిగణనలోకి తీసుకొనైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.
-కేటీఆర్