హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాంగ్రెస్ ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనారిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వంచించిందో అసెంబ్లీలో ఎడగడుతామని, అపరిష్కృత హామీలపై నిలదీస్తామని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్లో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం కుల, మతాలకు అతీతంగా, గంగా-జమునా-తెహజీబ్తో అద్భుతంగా ముందుకు సాగిందని తెలిపారు.
గత ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ.. మత సామరస్యానికి పెద్దపీట వేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆశయాలను పక్కన పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి ఏటా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మైనారిటీలకు ఆయన పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తనను ఆహ్వానించిన పార్టీ మైనారిటీ సెల్ సోదరులకు కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని మైనారిటీలతోపాటు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగా-జమునా తెహజీబ్ సాకారమైందని తెలిపారు. దేశంలోనే సెక్యులర్ నేతగా కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా గతంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని భారీ తెరపై ప్రదర్శించారు. ఇఫ్తార్ విందును పురస్కరించుకొని తెలంగాణభవన్లో విద్యుత్తు అలంకరణ, రుచికరమైన భోజనం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కిశోర్గౌడ్, పల్లె రవికుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎంకే ముజీబ్, మాజీ ఎమ్మెల్సీలు ఫరూఖ్ హుస్సేన్, సలీం, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, వక్ఫ్బోర్డు ఎక్స్ చైర్మన్ మసిఉల్లా, మాజీ కార్పొరేటర్లు షఫీ, బీఆర్ఎస్ సీనియర్ నేతలు సొహైల్ అబ్దుల్లా, సల్మాన్, అజామ్ అలీ, బద్రోద్దీన్, ఇస్లామిక్ మత పెద్దలు మౌలానా అహ్మద్ నక్షబంది, మౌలానా జుబేర్, పెద్ద సంఖ్యలో మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.