Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్ను సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్రావు సైతం పరిశీలించారు. ఇదిలా ఉండగా.. కేంద్రం ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ కుడి కాలువ 7 నెంబర్ గేటును అధికారులు మూసివేశారు.
ప్రస్తుతం ఐదో నంబర్ గేట్ ద్వారా నీటి విడుదలవుతుండగా.. ఈ గేట్ను సైతం రాత్రి వరకు మూసివేయనున్నట్లు సమాచారం. ఏపీ విభజనలో భాగంగా కేఆర్ఎంబీ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. అయితే, గత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా డ్యామ్పై పోలీసు బలగాలను మోహరించి.. అనుమతి లేకుండా నీటిని విడుదల చేసింది. తెలంగాణ సైతం బలగాలను సంఘటనా స్థలంలో మోహరించింది.
కేంద్రం జోక్యంతో రెండు రాష్ట్రాలు బలగాలను ఉపసంహరించాయి. ప్రస్తుతం డ్యామ్ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, పరిస్థితిపై కేఆర్ఎంబీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి వ్యవహరించింది అందులో పేర్కొంది. ఇండెంట్ లేకుండా, లేఖ రాయకుండా ఏపీ నీటిని విడుదల చేసిందని నివేదికలో తెలిపింది. మొదట ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్లో ఐదు టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉందని నివేదికలో నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.