హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీల బృందం కలిసింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ మంత్రికి లేఖను అందించింది.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణ ప్రజల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ విషయమై పార్లమెంట్లో చర్చ లేవనెత్తుతామని చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింతను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్లో విచారణ పూర్తియ్యేంత వరకు ఇరు రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్ను కోరినట్టు నామా నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నదని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు చేయాలని, నీటి వాటాలు తేల్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 264 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకే శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారని, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 830 అడుగుల నీటిమట్టమే ఎండీడీఎల్ అని స్పష్టంచేశారు. శ్రీశైలం నుంచి 34 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ బయటి బేసిన్కు మళ్లించేందుకు పరిమితమై ఉండేలా చేయాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తాగునీటికి వినియోగిస్తున్న జలాలను 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. క్యారీఓవర్ స్టోరేజీకి అవకాశమివ్వాలని, తెలంగాణకు కేటాయించిన నీటిని అదే సంవత్సరం కాకుండా.. తదుపరి సంవత్సరంలో వాడుకునే అవకాశం ఉండాలని కోరినట్టు వివరించారు. నాగార్జునసాగర్ డ్యామ్పై సీఆర్పీఎఫ్ బలగాల భద్రత అవసరంలేదని కేంద్ర మంత్రికి స్పష్టం చేసినట్టు నామా తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీలు జీ రంజిత్రెడ్డి, బీ వెంకటేష్నేత, బీ లింగయ్య యాదవ్, ఆర్ సురేశ్రెడ్డి తదితరులున్నారు.