హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తాగునీటి కోసం అదనపు జలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేఆర్ఎంబీ తిరస్కరించింది. త్రిసభ్య కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేటాయించిన నీటి కోటాకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదనపు జలాలను కేటాయించడం కుదరదని తేల్చిచెప్పింది.
మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో కూడిన త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లో సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని ఆ కమిటీ తేల్చింది.
అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాలకోసం రిజర్వ్ చేసింది. మిగిలిన 90 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి గత అక్టోబర్లోనే త్రిసభ్య కమిటీ కేటాయించింది. కోటా నీటిలో తెలంగాణ 31.17 టీఎంసీలను జనవరి 30వ తేదీ నాటికే వినియోగించుకున్నది. మే మాసాంతం వరకు తాగునీటి కోసం మొత్తం 8.90 టీఎంసీలు అవసరమవుతాయని, ఆ మేరకు నీటిని విడుదల చేసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ సర్కారు ఇటీవలే కేఆర్ఎంబీకి లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని ఏపీ సర్కారుకు బోర్డు లేఖ రాసింది. అయితే తెలంగాణ ఇప్పటికే 35 టీఎంసీలకు మించి 36.80 టీఎంసీలను వినియోగించుకున్నదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదనపు జలాలను కేటాయించేందుకు అంగీకరించబోమని ఏపీ సర్కారు స్పష్టంచేసింది. అదే విషయాన్ని తెలుపుతూ బోర్డు తాజాగా తెలంగాణకు లేఖ రాసింది. అదనపు జలాల కేటాయింపు కుదరదని స్పష్టంచేసింది.