హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి తాగు, సాగునీటి అవసరాలపై ఇండెంట్ను ఈ నెల 24లోగా అందజేయాలని తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. ఇండెంట్లు అందిన తర్వాత తదుపరి సమావేశం తేదీలను ఖరారు చేస్తామని తెలిపింది. తెలంగాణ సర్కారు తాగునీటి కోసం 19 టీఎంసీలు, సాగునీటి కోసం 151 టీఎంసీలు కావాలని ఇప్పటికే ప్రతిపాదించింది. ఏపీ ప్రతిపాదనలు అందజేయాల్సి ఉన్నది. కేంద్రం జారీచేసిన గెజిట్ అమలులో భాగంగా కేఆర్ఎంబీ సభ్యులు ఈ నెల 26 లేదా 27, 28 తేదీల్లో ఆర్డీఎస్, సుంకేశుల, జూరాలను సందర్శించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నెట్టెంపాడు, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ సభ్యులు సందర్శించారు. అటు.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సబ్కమిటీ సమావేశాన్ని 24న హైదరాబాద్లోని జలసౌధలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సబ్కమిటీ కన్వీనర్, మెంబర్ సెక్రటరీ బీపీ పాండే తెలంగాణ, ఏపీకి లేఖలు రాసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అమలులో భాగంగా తొలుత తెలంగాణకు సంబంధించిన 3, ఏపీకి సంబంధించిన 5 ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకొనేందుకు జీఆర్ఎంబీ కసరత్తు చేస్తున్నది. ఆయా అంశాలపై సబ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.