KRMB and GRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాగిత రహిత సేవలను అందించడంలో భాగంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కేంద్ర ప్రభుత్వ సాయంతో పైసా ఖర్చు లేకుండా ఈ-ఆఫీస్ను అందుబాటులోకి తీసుకొస్తే.. అందుకు విరుద్ధంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) తమ ఈ-ఆఫీస్ కోసం రూ.1.20 కోట్లు వెచ్చించింది. దీనిపై రెండు తెలుగు రాష్ర్టాల ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి జీఆర్ఎంబీ కంటే కేఆర్ఎంబీలోనే ఫైల్ మూవ్మెంట్, ఇరు రాష్ర్టాల సంప్రదింపులు రెగ్యులర్గా కొనసాగుతుంటాయి. ఉమ్మడి ప్రాజెక్టులు సైతం కేఆర్ఎంబీలోనే ఎక్కువ. అక్కడే ఉచితంగా ఈ-ఆఫీస్ను అమలు చేస్తుంటే.. అంతగా పనిలేని జీఆర్ఎంబీ మాత్రం తన ఈ-ఆఫీస్కు రూ.1.20 కోట్లు వెచ్చించడం గమనార్హం. దీనిపై తెలంగాణ అధికారులు బోర్డుకు లేఖ రాసేందుకు సంసిద్ధమయ్యారు.