హైదరాబాద్, ఆగస్టు11(నమస్తే తెలంగాణ): భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం బోర్డుకు ఓ లేఖ రాశారు. నీటినిల్వకు ఆఫ్లైన్ రిజర్వాయర్లు అందుబాటులో లేని దృష్ట్యా వాన కాలం సీజన్కు ముందు 18.70 టీఎంసీలను ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్లో తెలంగాణ నిల్వ పెట్టుకున్నదని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని బోర్డుకు ఇప్పటికే విన్నవించామని లేఖలో వెల్లడించారు. ఆ నీళ్లను ఈ నీటి సంవత్సరంలో వాడుకుంటామని, అయితే ఈ ఏడాది కోటాలో వాటిని పరిగణించవద్దని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఏపీ గత ఏడాది తన కోటాకు మించి 51.74 టీఎంసీల జలాలను వినియోగించుకున్నదని, ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. నిరుడు ఏపీ కోటాకు మించి వినియోగించిన జలాలను ఈ నీటి సంవత్సరంలో కలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకోవాలనే అంశాన్ని కేంద్ర జలశక్తిశాఖకు సిఫారసు చేయాలని 17వ బోర్డు మీటింగ్ నిర్ణయించిందని, ఇప్పటివరకు ఆ దిశగా చేపట్టిన చర్యలకు సంబంధించిన సమాచారమివ్వాలని బోర్డును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.