Tungabhadra | అయిజ, అక్టోబర్ 5: మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అతిథి గృహంలో బోర్డు ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ఎస్ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. నదీ పరీవాహక రాష్ర్టాలు కేడబ్ల్యూడీటీ (కృష్ణా వాటర్ డిస్ఫ్యూట్ ట్రిబ్యునల్) నిబంధనల మేరకు 212 టీఎంసీలు వినియోగించుకునేలా కేటాయింపులు జరిపారు.
ఈ మేరకు కర్ణాటకకు 138.990 టీఎంసీలు, ఏపీకి 66.500 టీఎంసీలు, ఆర్డీఎస్కు 6.510 టీఎంసీలు వాడుకునేందుకు అవకాశం ఉన్నది. అయితే నాలుగైదేండ్లుగా తుంగభద్ర నదికి వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకుని 2023-24 ఏడాదిలో 105 టీఎంసీలు వస్తుందని అధికారుల అంచనా. అయితే.. 2023, జూన్ 8న జరిగిన సమావేశంలో తుంగభద్ర బోర్డు ఎస్ఈల సమావేశంలో 175 టీఎంసీలు వస్తాయని అంచనా వేసినా వర్షాలు కురవకపోడంతో అంచనాలను సవరించి నీటి కేటాయింపులు చేశారు. కర్ణాటకకు 68.839 టీఎంసీలు, ఏపీకి 32.936టీఎంసీలు, తెలంగాణలోని ఆర్డీఎస్కు 3.224 టీఎంసీలను వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈలు, ఈఈ, ఎస్డీవో పాల్గొన్నారు.