హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ జరపాల్సిన విచారణ మార్చి 5కు వాయిదా పడింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీగా కృష్ణా జలాలను కేటాయించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ, వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్కు విచారణాధికారాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్-2కు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి ఈ నెల 24 వరకు ఢిల్లీలో కొనసాగాల్సి ఉన్నది. కానీ, ఈ విచారణను వాయిదా వేయాలని తెలంగాణ, ఏపీ విడివిడిగా అప్పీల్ చేశాయి. దీంతో విచారణను మార్చి 5, 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్కుమార్ ప్రకటించారు.
విచారణ అంశాలను నివేదించిన తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాలపై అభ్యంతరాలను తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని ఏపీ వాదించింది. దీన్ని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్కుమార్ తోసిపుచ్చుతూ.. నూతన మార్గదర్శకాల మేరకే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన అంశాలను 6 వారాల్లోగా నివేదించాలని రెండు రాష్ర్టాలను ఆదేశించారు. దీంతో తెలంగాణ ఇప్పటికే విచారణ అంశాలను ట్రిబ్యునల్కు సమర్పించింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు, కృష్ణా జలాల పునఃపంపిణీతోపాటు గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలకు సంబంధించిన అంశాలను కూడా అందులో చేర్చింది. అయితే ఏపీ మాత్రం ఇప్పటికీ విచారణ అంశాలను దాఖలు చేయలేదని సమాచారం.