హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా.. దూరంగా ఉన్న విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం తుగ్లక్ చర్య అని రాయలసీమ ఉద్యమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధలో సోమవారం ఆయన కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ను ప్రత్యేకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కృష్ణా రివర్ బోర్డును హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బోర్డుకు ప్రతిపాదనలు పంపిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసమే రివర్ బోర్డులను ఏర్పాటు చేశారని, వాటిని రివర్ బేసిన్ లేని విశాఖకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేస్తే ఇరు రాష్ర్టాలకు సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు. కేంద్ర సర్కారు సిద్ధ్దేశ్వరం వద్ద కేవలం తీగల వంతెనను నిర్మించాలని ప్రతిపాదించిందని, అలా కాకుండా రోడ్ కమ్ బరాజ్ను నిర్మించాలని కోరారు.