హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఈ నెల 13న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు గురువారం లేఖలు రాసింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
తాగునీటి అవసరాలకు 15 రోజుల పాటు రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున సాగర్ ఎడ మ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇటీవల ప్రతిపాదించింది. ఏపీ తన కేటాయింపులకు మించి జలాలను ఇప్పటికే వినియోగించుకున్నదని, పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ కుడి కాలువకు ఇప్పటికీ నీటిని విడుదల చేస్తున్నదని, వెంటనే ఏపీని నిలువరించాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. 13న జరిగే సమావేశంలో ఈ రెండు అంశాలపై చర్చించనున్నారు.