రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ను కృష్ణాబోర్డు లేదా సీడబ్ల్యూసీ ఆమోదించేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు కొనసాగించవద్దు. ఈ మేరకు ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించవద్దు. వాస్తవాల పరిశీలనకు ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ఏర్పాట్లుచేయాలని కోరితే పట్టించుకోరా? సహకరించేందుకు నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించరేం?
–ఏపీకి రాసిన లేఖలో కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి హెచ్కే మీనా
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణానదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణ పను లు కొనసాగిస్తున్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 21న కేఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్అయ్యర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు ప్రాంతంలో పనులు జరుగుతున్న ఆధారాలను సమర్పించారు. కృష్ణా నది నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా జలాల తరలింపును అడ్డుకోవాలని లేఖ లో కోరారు. దీనిపై కేఆర్ఎంబీ స్పందించింది. రాయలసీ మ డీపీఆర్ను సమర్పించి, ఆమోదం పొందేవరకు పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించవద్దని ఆదేశించింది. బోర్డు సభ్యకార్యదర్శి హెచ్కే మీనా బుధవారం ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖరాశారు. ఎట్టిపరిస్థితుల్లో పనులు చేపట్టవద్దని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు.
కేఆర్ఎంబీ నిజనిర్ధారణ కమిటీ వేయాలని, స్వతంత్రంగా దర్యాప్తు జరిపి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో ఉల్లంఘనలు జరిగాయేమో పరిశీలించాలని ఎన్జీటీ తీర్పులో ఆదేశించిందని హెచ్కే మీనా గుర్తుచేశారు. కేఆర్ఎంబీ గతంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిందని తెలిపారు. ఈ విషయాన్ని బృంద నాయకుడు/బోర్డు సభ్యుడు.. ఏపీ ప్రభుత్వానికి కూడా తెలియజేశారన్నారు. తమ పర్యటనకు ఏర్పాట్లుచేయాలని, సహకరించేందుకు నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్టు చెప్పారు. అయినా ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలు చెప్తూ ఇప్పటివరకు నోడల్ అధికారిని కూడా నియమించలేదని అసహనం వ్యక్తంచేశారు. ఏపీ అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ పనులను కొనసాగిస్తున్నదని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఫిర్యాదుచేశారని, ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు ఆధారాలు సమర్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. డీపీఆర్లను కేఆర్ఎంబీ లేదా సీడబ్ల్యూసీ ఆమోదించేవరకు పనులు జరుపొద్దని స్పష్టం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. అక్రమంగా పనులు చేపట్టడంపై కేఆర్ఎంబీకి, కేంద్ర జల్శక్తి శాఖకు పలుమార్లు ఫిర్యాదుచేసింది. ఎన్జీటీలోనూ సమర్థంగా వాదననలు వినిపించింది. ఏపీ మాత్రం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇటు కేఆర్ఎంబీని, అటు ఎన్జీటీని, కేంద్రాన్ని మోసం చేస్తూనే ఉన్నది. డీపీఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ మాత్రమే చేస్తున్నామని, ప్రధాన నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఎన్జీటీ వద్ద ఏపీ బుకాయించింది. నిజనిర్ధారణ కమిటీ పరిశీలన జరిపితే గుట్టు బయటపడుతుందనే కారణంతో ఏపీ ఇప్పటివరకు కమిటీ పర్యటనకు ఏర్పాట్లుచేయలేదు.