Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్థికంగా కుంగిపోయారు. చివరకు మంత్రి కోమటిరెడ్డిని కలిసి విన్నవిస్తే ఐదు రోజుల పాటు కాల్వలకు నీళ్లు వదిలారు. అదేదో ముందే వదిలితే బోర్లు వేసి రైతులు బొక్కాబోర్లా పడేవారు కాదు కదా!
సంగంబండ రిజర్వాయర్ పరిధిలో సాగునీరు వదలకపోవటంతో పంటలను కాపాడాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కోరగా, ఆయన విజ్ఞప్తి మేరకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాలతో నీళ్లు వదిలారు. ఉన్న నీళ్లను వదిలేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల పైరవీలు అవసరమా?
ఇలా చెప్పుకుంటూ పోతే… రాష్ట్రంలోని మధ్యతరహా ప్రాజెక్టులు మొదలు భారీ ప్రాజెక్టుల వరకు సాగునీటి నిర్వహణ ఆగమ్యగోచరంగా తయారైంది. ‘ఇగురం లేని మనిషి దుక్నం పెడితే వచ్చిన గిరాకీ మళ్లిపోయిందట!’ అనేది తెలంగాణ పల్లెల్లో సామెత. ఇప్పుడు సాగునీటి రంగంలో కాంగ్రెస్ సర్కారు తీరు కూడా ఇలాగే ఉన్నది. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడుపు లేకపోవటంతో తెలంగాణ రైతు అల్లాడిపోతున్నాడు. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అమలైన నిర్వహణ విధానాలనే పట్టుకొని వేలాడుతుండటంతో జలాశయాల్లో ఉన్న నీటినిల్వలను సరిగా వాడుకోలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ రాజకీయ విషవలయంలో చిక్కుకుని ప్రజాప్రతినిధుల పైరవీల మీద గేట్లు తెరుచుకునే పరిస్థితి నెలకొన్నది. అందుకే ప్రతి జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి, కడుపు మండిన రైతన్న రోడ్లమీదకొచ్చి దుమ్మెత్తిపోస్తున్నాడు. దీంతో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం, మంత్రులు ఆ నెపాన్ని వరుణదేవుడిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలున్నపుడు వరుణుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు తమ వైఫల్యంతో వచ్చిన కరువును దాచిపెట్టేందుకు ఆ వరుణుడిపైనే నింద వేస్తున్నది. కానీ ఒక్కసారి ప్రభుత్వ, వాతావరణశాఖ అధికారిక రికార్డులు చూస్తే.. తెలంగాణలో 2023-24లో సాధారణం కంటే ఐదు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సరాసరి వర్షపాతం 874.9 మిల్లీమీటర్లు కాగా, కురిసిన వర్షపాతం 920.3 మిల్లీమీటర్లు.33 జిల్లాల్లో నల్లగొండ, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం, అధిక వర్షపాతాలే నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల్ని ఒడుపుగా వాడితే అన్నదాత గట్టెక్కే మార్గమున్నా, రాష్ట్రంలో పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? నిన్నటిదాకా అందుబాటులో ఉన్న భూగర్భజలాలు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? అందుకే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే మరింకేంటి?!
సాధారణంగా సాగునీరు అందించాలంటే ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు ఇలా పంటపొలాల వరకు నీళ్లు అందించాలనేది సాంకేతికంగా సరైనది కావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు సైతం అనేకం ప్రధాన కాలువల వరకు నిర్మాణం జరిగి, దశాబ్దాలు గడిచినా ఆయకట్టుకు నీరందించకుం డా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా తెలంగాణ భౌగోళిక పరిస్థితి వేరు. ఇక్కడ కుతుబ్షాహీలు, కాకతీయులు తవ్వించిన వేల చెరువులు ఉన్నాయి. చెరువులేని ఊరే లేదు. కానీ ఏపీలో చెరువులు ఉండవు. అందుకే పంటపొలాల వరకు మైనర్లు, సబ్ మైనర్లతో సాగునీరు అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రధాన కాల్వకు చెరువులను అనుసంధానిస్తే తటాకాలన్నీ నిండుకుండల్లా మారుతాయి. తద్వారా చుట్టూ కిలోమీటర్ల కొద్దీ భూగర్భజలాలు పెరుగుతాయి. దీంతో రైతులు బోర్లు, బావుల ద్వారా సాగునీటిని పొందుతారు. దశాబ్దాలుగా మనది బోర్లు, బావుల మీద ఆధారపడి కొనసాగుతున్న వ్యవసాయమే.అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాం లో ఒకవైపు ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు (హెడ్రెగ్యులేటరీ వర్క్స్, ప్రధాన కాల్వలు) పూర్తయిన వెంటనే చెరువులను అనుసంధానించారు. దీంతో ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీరు చెరువుల్లోకి వెళ్లి భూగర్భజలాలు తక్కువ లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. ఎలాగూ ఉచిత విద్యుత్తు కావడంతో అన్నదాత ఎవరిదిక్కు చూడకుండా సాఫీగా వ్యవసాయం చేసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొదలు పరిస్థితి మారిపోయింది. చెరువులంటే వర్షాలకు నిండాలి తప్ప ప్రాజెక్టుల నీటితో ఎలా నింపుతాం? అనే విచిత్ర ధోరణి కనిపిస్తున్నది. అందుకే చెరువులు నింపే అవకాశం ఉన్నా ప్రభుత్వ పట్టింపులేక రైతులు రోడ్డునపడే స్థితికి చేరుకున్నాడు.
ఒక టీఎంసీతో పదివేల ఎకరాలకు సాగునీరు.. సాగునీటి రంగంలో ఇదో ప్రాథమిక సూత్రం. వాస్తవమే కావచ్చు. కాల్వల ద్వారా నేరుగా పంటపొలాలకు సాగునీరు అందిస్తే ఈ సూత్రాన్ని అమలు చేయొచ్చు. కానీ మనకు వారసత్వ సంపదగా వచ్చిన చెరువులు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వేల చెరువులను ప్రాజెక్టులకు అనుసంధానించింది. దీంతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను చెరువులకు మళ్లించటం ద్వారా రైతులు భూగర్భజలాలు వినియోగించేకొద్దీ చెరువునీటి ద్వారా భూగర్భజలాలు రీచార్జ్ అవుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ కావడంతో పరిస్థితి ఇలా దాపురించింది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను టీఎంసీకి పదివేల ఎకరాల చొప్పున లెక్కించి, ఆయకట్టుకు సరిపడ నిల్వలు లేనందున సాగునీరు ఇవ్వలేమంటూ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముందుగానే చేతులెత్తేశారు. ఏడెనిమిది ఏండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా సాగుచేసిన రైతులు అదే ఆశతో బోర్లు, బావుల కింద పంటలు వేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడుపు లేక చెరువులు నింపలేదు. రైతులు భారీఎత్తున భూగర్భజలాలను తోడటంతో ఇప్పుడు బోర్లు, బావులు ఎండిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఎవరికి వారే యమునాతీరే! అన్నట్టుగా వాళ్ల పైరవీలతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ప్రణాళిక లేకుండా విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఉన్న నీటి నిల్వలతో ప్రయోజనం అందక, అటు భూగర్భజలాలు అడుగంటిపోయి రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైంది.