హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీసబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వ విద్యాలయంగా మార్చే అంశంపై మంగళవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపుతో నడుస్తున్న ఈ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేసి, నివేదిక రూపొందించాలని సూచించారు. విధి విధానాలు, అనుమతుల వివరాలు అందించేందుకు ఉన్నతాధికారులతో అంతర్గత కమిటీ వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ కాలేజీలో4,159 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వర్సిటీగా మారిస్తే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
కోఠి మహిళా కాలేజీకి చారిత్రక వైభవం ఉండటంతో విశ్వవిద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్న త విద్యలో మహర్దశ మొదలవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి సబిత తెలిపారు. విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్కు మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పారు.ఈ వర్సిటీలో ఆధునిక కోర్సులు బోధించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి లో ప్రతిపాదనలు సిద్ధంచేసి, త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞులత మంగ తదితరులు పాల్గొన్నారు.