భీమదేవరపల్లి, జనవరి 9 : హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ(Kothakonda)లో భక్తుల కొంగుబంగారమైన వీరభద్రస్వామి(Veerabhadraswamy) బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకరసంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన వీరభద్రుడి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈనెల 18వ తేదీన స్వామివారి గ్రామపర్యటనతో ముగుస్తుంది.
ఇప్పటికే స్వామివారి కల్యాణమహోత్సవ వేదిక అందంగా ముస్తాబైంది. జాతరకు రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలనుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పన, తాగునీటిసదుపాయం, వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కిషన్రావు తెలిపారు. అదేవిధంగా జాతరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుస్తాయి. వరంగల్-1 డిపో నుంచేగాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోలనుంచి నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నిరంతరం నడుస్తాయి.
ఈనెల 10న సాయంత్రం వీరభద్రస్వామివారి కల్యాణం, 14న భోగి పండుగ, 15సంక్రాంతి పర్వదినాన బండ్లు తిరుగుట, 16న నాగవెల్లి, పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదేరోజున సాయంత్రం స్వామివారి గ్రామపర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.