Mulugu | ములుగు రూరల్ : ములుగు జిల్లా కొత్తగూడలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. సర్పంచ్ ఈశ్వర్స్వామి, ఉప సర్పంచ్ కంచర్ల శ్రీనివాసచారిలు శనివారం ములుగు జిల్లాకేంద్రంలో రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎన్నికల ఇన్చార్జ్జి వై.సతీశ్రెడ్డి నేతృత్వంలో బీఆర్ెస్లో చేరగా వారికి జడ్పీచైపర్సన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాంపూర్ సర్పంచ్ ఈశ్వర్స్వామి, శ్రీనివాసచారిలు మాట్లాడుతూ.. సుమారు 40వేల ఎకరాలకు సంబంధించిన 10 వేల మంది రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు ఇచ్చారని అన్నారు. భూమి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు సైతం పట్టాలు అందించడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. 2005లో కాంగ్రెస్ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ చట్టం వల్లనే గిరిజనేతరులకు పట్టాల పంపిణీ అడ్డంకిగా మారిందని వారు గుర్తుచేశారు. ఈ చట్టం ప్రకారం 2005 ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి 75సంవత్సరాల క్రితం ఏజెన్సీలో స్థిరపడిన గిరిజనేతలకు మాత్రమే పోడు పట్టాలు పొందేందుకు అర్హత ఉందని అన్నారు. అయితే ఈ నిబంధనల ప్రకారం స్వాతంత్య్రానికి పూర్వం ఏజెన్సీ ఏరియాలో స్థిరపడిన గిరిజనేతరులకు మాత్రమే పోడు భూమిపై హక్కు ఉంటుందని, అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాన్ని కప్పి పుచ్చి ఓటర్లను మభ్యపెడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనేతరులకు అన్యాయం చేస్తే గిరిజనేతులకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సీతక్క స్వార్థపూరిత రాజకీయాలు, ద్వంద్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.
అనంతరం నాగజ్యోతి మాట్లాడుతూ.. గత ప్ఱభుత్వాలు చేసింది శూన్యమని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. ఆడపిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.