హైదరాబాద్ : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల, బాలుర పాఠశాలలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో విద్య గొప్పదనం, ప్రాముఖ్యత గురించి మాట్లాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు వచ్చేవి.
కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అందరికీ కేజి టూ పీజీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే ధృఢ సంకల్పం వల్ల నేడు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటీ, ట్రిపుల్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు.
భవిష్యత్ లో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.