హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా హుస్సేన్సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించ తలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం 12 అడుగుల అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. భావితరాలకు స్ఫూర్తినివ్వాలనే మహదాశయంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. 12 ఎకరాల స్థలంలో మెమోరియల్ పార్క్ను తీర్చిదిద్దుతున్నారని వివరించారు. నెల రోజుల్లో 25 అడుగుల నమూనా విగ్రహాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. ఆ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి అవసరమైన మార్పులను సూచిస్తారని, ఆ తరువాత పూర్తిస్థాయి విగ్రహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. అనంతరం విగ్రహశిల్పి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాంసుతారాను సత్కరించారు. కార్యక్రమంలో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు సాయన్న, అబ్రహాం, క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా, ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన డిగ్రీ పుస్తకాలను గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉర్దూ మీడియంలో కొనసాగుతున్న 24 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.