హైదరాబాద్ : ధర్మపురి(Dharmapuri) బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్(BRS social media warrior) సల్వాజీ మాధవ రావును మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) పరామర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాధవ రావును బుధవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
కాగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కాంగ్రెస్ నాయకులు(Congress), కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి, ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ సల్వాజీ మాధవరావుపై దాడి చేశారు.
ఎస్సారెస్పీ కెనాల్ నీరు రాక ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాధవరావు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు సోగాల తిరుపతి, సోగాల వంశీ, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి.. సోమవారం రాత్రి మాధవరావు ధర్మారంలో ఓ ప్రింటింగ్ ప్రెస్లో పని ముగించుకుని వెళ్తుండగా దాడి చేశారు.