ధర్మపురి, ఫిబ్రవరి 7: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వేల కోట్లతో ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురిలో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తొలి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తప్ప, రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టిపోసిన ఆనవాళ్లు లేవని ఆరోపించారు.
ఈ మేరకు శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50శాతం సర్పంచులను గెలుచుకొని సత్తా చాటడంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.