జమ్మికుంట, జూన్ 22: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేదని, తన స్వార్థ ప్రయోజనాలకు కోసం బీజేపీలో చేరాడని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు, సభ్యులతో సమావేశమయ్యారు. దురాలోచనతో పార్టీలోనే ఉంటూ ఈటల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు చెప్పారు. మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు రూ.500 కోట్లు మంజూరుచేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని చెప్పారు. స్థలం ఉన్న వారి కోసం ఇండ్లు కట్టుకునేందుకు నగదును అందజేస్తామని పేర్కొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు నెల రోజుల్లో అందరికీ అందుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. వచ్చే ఉప ఎన్నికలో ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కోరారు.