జగిత్యాల, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైడ్రా (Hydraa)పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో అందరి దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి హైడ్రా పేరిట ఇండ్ల కూల్చివేతకు పాల్పడుతున్నారన్నారు.
హైడ్రా పేరిట రాజకీయం చేయడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగితే చట్టబద్దంగా నోటీసులు ఇచ్చి కూల్చివేయాలే తప్పా, ఇష్టారాజ్యంగా నోటీసులు లేకుండానే కూల్చివేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 ఏండ్లు పాలన చేసి, చెరువులను సర్వనాశనం చేసిన చరిత్ర, ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ గత పాలకుల వల్లే చెరువులు కబ్జా అయ్యాయని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లనో నిర్మాణాలు చేపట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, కేసీఆర్ పుణ్యమా..? అని చెరువులు తిరిగి బతికాయన్నారు.
బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ల్లో నిర్మాణాలన్నీ కాంగ్రెస్, టీడీపీల పాపమే అన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఇండ్ల నిర్మాణాలను కూల్చివేయడం సరికాదన్నారు. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబీకులకు సంబంధించిన నివాసగృహాలు, అపార్ట్మెంట్లను పరిశీలించి వాటిని రైగ్యులరైజ్ చేసే విషయాన్ని ఆలోచించాలన్నారు. హైడ్రా పై కూల్చివేతలు, కక్షపూరిత చర్యలను సీఎం రేవంత్రెడ్డి విచక్షణకే వదిలివేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు.