చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 11: రాజగోపాల్రెడ్డి నామినేషన్కు ముందే డక్ అవుట్ అయ్యాడని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం డి.నాగారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వేముల పాల్గొన్నారు. ఇం టింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వివిధ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాజగోపాల్రెడ్డి రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉప ఎన్నిక వచ్చిందని, ఇదేమీ ప్రజల కోసం వచ్చింది కాదని పేర్కొన్నారు. రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలంటే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రాజగోపాల్ ఏనాడూ గ్రామాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అభివృద్ధి కావాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని, బీజేపీలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. డి.నాగారం నుంచి కొయ్యలగూడెం వరకు రూ.4 కోట్లతో రోడ్డు పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆది మహావిష్ణువు దేవాలయం వరకు మరో రూ.10 కోట్లతో రెండో దశ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి టీఆర్ఎస్ నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, కళ్లెం శ్రీనివాస్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సూరికంటి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ కొండ హారిక పాల్గొన్నారు. కాగా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండల పరిధిలోని దామెర, చింతలగూడెం గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు.