కొత్తగూడెం అర్బన్ : కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధులై ఉన్నారని జోస్యం చెప్పారు.
కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి దేశ సంపదనంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను రక్షించుకునేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.ప్రశ్నించేవారందరిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం నరేంద్ర మోదీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. కర్ణాటక(Karnataka) లో 40శాతం మంది బీజేపీ నాయకులు అవినీతిలో కూరుకుపోవడంతో ఆ పార్టీని ప్రజలు ఓడించారని, ఇది మార్పునకు సంకేతమన్నారు.
రాముని పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్(CM KCR) బీజేపీపై చేస్తున్న యుద్ధానికి తామంత సహకారం అందిస్తామని అన్నారు. బొగ్గుగనులను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా రాష్ట్రాలన్నింటినీ ఇబ్బందులుపెడుతూ పరిపాలన సాగించకుండా మోకాలడ్డుతోందన్నారు. విభజన చట్టంలోని హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ(Kajipeta Coach Factory), బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 4న ప్రకాశం స్టేడియంలో నిర్వహించే ‘ప్రజా గర్జన’ ముగింపు సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా, నాయకులు బందెల నర్సయ్య, చంద్రగిరి శ్రీనివాస్, దమ్మాలపాటి శేషయ్య, ముత్యాల విశ్వనాధం, వై.శ్రీనివాసరెడ్డి, నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.