Myanmar : సైబర్ మోసాల (Cyberscam Offences) ను అరికట్టడానికి మయన్మార్ (Myanmar) సర్కారు కీలక ముందడుగు వేసింది. సైబర్ నేరం కేసుల్లో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష (Death Sentence) విధించేలా రూపొందించిన ఆన్లైన్ మోసాల నిరోధక బిల్లు (Anti Cyber Crimes Bill) ను ఆ దేశ చట్టసభ ఆమోదించింది. సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) బాధితులను నిర్బంధించినా, హింసించినా కొత్త చట్టం కింద వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పార్లమెంట్ స్పీకర్ (Parliament) ఆంగ్ లిన్ డ్వే (Aung Lin Dwe) వెల్లడించారు.
నిందితులకు జీవితఖైదు విధిస్తామని, సైబర్నేరాలవల్ల ఇతరుల మరణానికి కారణమైన వారికి మరణశిక్ష విధిస్తామని ఆంగ్ లిన్ అన్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో విదేశాలలోని విద్యార్థులను మయన్మార్కు రప్పిస్తున్నారని, అనంతరం వారిని బెదిరించి సైబర్ నేరగాళ్లుగా మారుస్తున్నారని, ఈ మేరకు అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. సోషల్ మీడియా ప్రకటనలు చూసి.. సింగపూర్లో ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల యువత అక్కడి సైబర్ ముఠాల వలలో చిక్కుకుపోయిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
సింగపూర్కు తీసుకువెళ్తామని చెప్పి దాదాపు 100 మంది తెలుగు విద్యార్థులను సైబర్ నేరగాళ్లు మయన్మార్కు తరలించారు. అనంతరం వారి పాస్పోర్ట్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్న సైబర్ ముఠా వారిని నిర్బంధించింది. సైబర్ నేరాలు చేయాలని బలవంతపెట్టింది. ఈ విషయాన్ని బాధితులు ఫోన్లో తమ కుటుంబసభ్యులకు తెలియజేయడంతో.. వారు జూలై 17న కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.