Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఆలయ ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు ఆలయ అదనపు బాధ్యతలు అప్పగించారు.
షాపుల కేటాయింపులో అక్రమాలపై ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో లీజులో గోల్మాల్ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. వెనువెంటనే దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్ జ్యోతిని నియమించారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించండంతో ఈ నెల 19న దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆఫీసులోని లీజుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నగదు వ్యవహారాల్లో రికార్డులు సరిగా లేకపోవడం, ఈవో పర్యవేక్షణ లోపంతోనే లీజు ద్వారా వచ్చిన నగదును ఆలయ ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించారు. అలాగే గతంలో చేపట్టిన ఆడిట్ అభ్యంతరాలను సైతం పరిశీలించకపోవడం, రీకాన్సిలేషన్ చేయకపోవడంలో ఈవో నిర్లక్ష్యం చూపారని ప్రాథమికంగా తేల్చారు. దీనిపై ఈ నెల 21న దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందజేశారు.
ఈ నివేదికలో 2007-2008 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 వరకు రూ.14.56 కోట్ల విలువైన ఆడిట్ అభ్యంతరాలను రీకాన్సిలేషన్ చేయకపోవడం, 2018-2019లో రూ. 59.18 లక్షల అభ్యంతరాలు రీకాన్సిల్ చేయకపోవడం, రూ. 17.61 లక్షలు నగదు పుస్తకంలో నమోదు చేసిన బ్యాంక్లో జమకాలేదని వెల్లడించారు. ఈవో నిర్లక్ష్యంతోనే ఆలయ పరిధిలోని ఓ ఉద్యోగి రూ. 52 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. 2023-2024లో ఆలయ ఖాతా పుస్తకంలో రూ. 4.93 కోట్లు నమోదు చేయగా, బ్యాంక్లో 4.81 కోట్లు మాత్రమే జమయ్యాయని, రూ. 11.55 లక్షలు డిపాజిట్ చేయలేదని వెల్లడించారు. ఆలయ ఈవో ఆడిట్ అభ్యంతరాలను పక్కన పెట్టడం, ఓ ఉద్యోగి రూ. 52.39 లక్షలు కాజేయడం, 9 నెలలుగా రికార్డుల పరిశీలన చేయకపో వడంతో పరిపాలన గాడి తప్పిందని నివేదికలో వెల్లడించారు. దీంతో ఈవో టంకశాల వెంకటేశ్ను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.