ముషీరాబాద్, మార్చి 7: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రౌడీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆమె ఇంటిని ముట్టడిస్తామని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. గురువారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్ అధినేతను కలిస్తే తట్టుకోలేక మంత్రి కొండా సురేఖ స్థాయిని మరిచి మాట్లాడటం శోచనీయ విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రాళ్ల దాడికి పాల్పడి, కాల్పులు జరిపించిన ఆమె కుటుంబ రౌడీయిజం ప్రజలందరికీ తెలుసునని మండిపడ్డారు. సమైక్య పాలకుల ఊడిగం చేసిన సురేఖకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని తెలిపారు. అత్యున్నత ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీని పూటకో పార్టీ మారే సురేఖ విమర్శించడం సిగ్గుచేటని తెలిపారు.