హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి కొండా సురేఖ. ప్రెస్మీట్ పెట్టి తనను విమర్శించిన ఎమ్మెల్యేలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ ఎమ్మెల్యేల వెనుక ‘అదృశ్యశక్తి’ ఉన్నదని ఆరోపించారు. ఆ అదృశ్యశక్తి ఎవరో గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు ఎమ్మెల్యేలు ఇలా వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. ఈ మేరకు పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి శనివారం ఆమె మరో లేఖ రాశారు. ‘టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ, నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నేతలతో బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక అదృశ్యశక్తి ఉన్నది.
ఆ అదృశ్యవ్యక్తులెవరో గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియామవళి ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ రెండు రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఇప్పటికే ఆమె జవాబు ఇచ్చారు. తన కూతురు మాట్లాడిన మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సీఎల్పీలో మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రెస్మీట్ పెట్టారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు సైతం కొండా సురేఖ, సుస్మితాపటేల్పై విమర్శలు చేశారు.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆరోపణలను మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండిస్తూ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉన్నదని, అందుకు తనకు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. అయినప్పటికీ పలువురు సీఎల్పీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మహిళా నేతలు ఒకే తరహాలో సమన్వయపూర్వకంగా తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారని, ఆ వ్యాఖ్యల వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. వారు చెప్తున్న మాటలు స్వతంత్రంగా వారి అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నట్టుగా లేవని, ఎవరో వారిని ప్రేరేపిస్తూ, నిర్దేశిస్తూ, ఒక నిర్ధిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే ఆనుమానం కలుగుతున్నదని తెలిపారు.
ఒకవైపు పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతుండగానే, ఇలాంటి ఘటనలు జరుగడం మరింత ఆందోళన కలిగిస్తున్నదని కొండా సురేఖ పేర్కొన్నారు. కాబట్టి వెనుక ఉండి పలువురు పార్టీ నాయకులను ఒకే విధమైన వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ సీనియర్ మహిళా నాయకురాలైన తనపై తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. వారంతా తనను బహిరంగంగా నిందిస్తూ, తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకురావడం కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమా? అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.