న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధుడు, మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
వారి సేవలను, వారితో ఉన్నా అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బహుముఖ ప్రజ్ఞశాలి అన్నారు. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మకు అండగా నిలిచిన న్యాయవాదిగా పలు రకాలుగా సేవలందించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నేత అన్నారు. ప్రజాసేవకుడిగా అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా భావించి తన సర్వస్వం ధారపోశారన్నారు.
కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, టీజీవో కోశాధికారి పుల్లెంల రవి కుమార్ గౌడ్, భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.